20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆత్మకూరులో భారీ క్రీడా ప్రాంగణం – మంత్రి ఆనం పరిశీలన
ఆత్మకూరు, సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి ): గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, యువ క్రీడాకారులకు ఆధునిక వసతులు కల్పించే లక్ష్యంతో ఆత్మకూరులో ప్రతిష్టాత్మక క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం క్రీడా వికాస కేంద్రాన్ని అధికారులు, క్రీడా శాఖ, రెవెన్యూ శాఖాధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.గతంలో ప్రతిపాదించిన స్థలంతో పాటు పక్కనే ఉన్న మరో 9 ఎకరాల 80 సెంట్ల భూమిని కలిపి మొత్తం 20 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.నెల్లూరులోని ఏసీ స్టేడియం కంటే విస్తృతంగా ఆత్మకూరు క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నేషనల్ హైవే, అభయాంజనేయస్వామి ఆలయం, నాగులపాడు రోడ్డు వైపు నుంచి సులభంగా చేరుకునేలా ప్రవేశ మార్గాలు, రహదారి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.రాబోయే 15 నుంచి 20 రోజుల్లో సమగ్ర ప్రణాళిక నివేదిక సిద్ధం చేయాలని సూచించిన మంత్రి, గ్రామీణ క్రీడాకారులకు ఆధునిక శిక్షణ, మెరుగైన వసతులు అందించడమే లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ, క్రీడా శాఖ, మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లు, కన్సల్టెన్సీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


