*అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇళ్ల స్థలం ఇస్తాం… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
*పల్లెగూడెం సమగ్ర అభివృద్ధికి రూ.61.76 కోట్లు కేటాయించినట్లు వెల్లడి*
*పల్లెగూడెం గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం:
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం లో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పల్లెగూడెంలోని ప్రభుత్వ, అసైన్డ్ భూములను గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలో ఉంటే, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, ఆక్రమణలను గుర్తించిన వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని మంత్రి అన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి అర్హుడికీ సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకోసమే భూములను సమీకరించి ఇళ్ల స్థలాలు అందిస్తామని తెలిపారు.
పల్లెగూడెం సమగ్ర వికాసానికి రూ. 61.76 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి అన్నారు. గ్రామంలో ఇప్పటికే రూ.50 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని, గొల్లగూడెం నుంచి పల్లెగూడెం వరకు ఎన్ఎస్పీ కాల్వ గట్టుపై రూ. 5.80 కోట్లతో మోడల్ సీసీ రోడ్డు పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా, పల్లెగూడెం నుంచి మంగళగూడెం వరకు రూ.55 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
రూ.20 లక్షల వ్యయంతో పంచాయతీ కార్యాలయ భవనాన్ని కేవలం రెండు నెలల వ్యవధిలోనే నాణ్యతతో పూర్తి చేయడం పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను మంత్రి అభినందించారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు రూ.12 లక్షలతో నూతన అంగన్వాడీ భవనాన్ని కూడా తక్షణమే మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
అర్హులైన వయోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందిస్తామని మంత్రి అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ, జిల్లాలో 110 గ్రామ పంచాయతీ నూతన భవనాలు మంజూరై అన్ని గ్రౌండింగ్ అయి, వివిధ దశల్లో ఉన్నాయన్నారు. అంగన్వాడీలకు నూతన భనవాల నిర్మాణం తుది దశలో ఉందన్నారు. వివో భవనాల నిర్మాణానికి 20 చోట్ల స్థల సమస్య ఉన్నట్లు, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యతగా వ్యవహరిస్తూ అభివృద్ధి పనుల పూర్తికి చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఇ యుగంధర్ రావు, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, ఇఇ మహేష్ బాబు, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, కమీషనర్ శ్రీనివాస రెడ్డి, పల్లెగూడెం సర్పంచ్ చుండూరి సుజన కృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


