రోడ్లు, బ్రిడ్జి, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భారీగా నిధులు
అనపర్తి, ఆగస్టు 26 (పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.39.40 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. రాబోయే నాలుగైదు రోజుల్లో మరికొన్ని పనులకు నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. రామవరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు.
పుష్కరాల నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.5 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. తొస్సిపూడి–కొంకుదురు రహదారికి రూ.2 కోట్లు, వడిశలేరు–తూర్పుగొనగూడెం బీటీ రోడ్డుకు రూ.2 కోట్లు, దుప్పలపూడి–కొత్తూరు రహదారికి రూ.70 లక్షలు, పులగుర్త రహదారి పనుల కొనసాగింపునకు రూ.35 లక్షలు మంజూరయ్యాయని వివరించారు.
సోమేశ్వరం–రాజానగరం రహదారికి రూ.10 కోట్లు మంజూరయ్యాయని, వాస్తవానికి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు పంపామని, మిగిలిన రూ.5 కోట్లు కూడా మంజూరు చేయాలని కోరుతున్నామని చెప్పారు. బలభద్రపురం–అనపర్తి కెనాల్ రోడ్డుకు రూ.5 కోట్లు, అనపర్తి–రాజమండ్రి రహదారి అభివృద్ధికి రూ.6.30 కోట్లు మంజూరవుతున్నాయని తెలిపారు.
బలభద్రపురంలోని పాత బ్రిడ్జి అభివృద్ధికి రూ.2.50 కోట్ల నిధులు త్వరలో మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. అనపర్తిలో కొత్త విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సహకారంతో రూ.4.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. దీంతో విద్యుత్ లోడ్ సమస్యలు తగ్గి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని పేర్కొన్నారు.
అనపర్తి–పెడపర్తి రేవు రహదారి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపామని, త్వరలో నిధులు మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు 80 శాతం బీటీ రోడ్లు అభివృద్ధి చేశామని, మిగిలిన రోడ్లతో పాటు పుంత రోడ్లను కూడా దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
నిధుల మంజూరుకు సహకరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు బీసీ జనార్దన్రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీడీపీ ఇన్చార్జి నల్లమిల్లి మనోజ్రెడ్డి, కూటమి నాయకులు పాల్గొన్నారు.


