సమస్యాత్మక గ్రామాల్లో ‘పల్లె నిద్ర’ సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు పోలీసులను చేరువ చేయాలనే లక్ష్యంతో ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కోడూరు రూరల్ సర్కిల్ పోలీసులు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ శ్రీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఓబులవారిపల్లి మండలం మంగంపేట గ్రామంలో కోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు, ఓబులవారిపల్లి ఎస్సై శ్రీ కె. సుజన్ కుమార్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా పుల్లంపేట మండలం కొమ్మలవారిపల్లి గ్రామంలో పుల్లంపేట ఎస్సై శ్రీ వి. చిన్న రెడ్డప్ప గ్రామంలో రాత్రి బస చేశారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమైన పోలీసు అధికారులు స్థానిక శాంతిభద్రతల పరిస్థితి, ప్రజల సమస్యలు, స్థానికంగా నెలకొన్న పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, ఘర్షణలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు శాఖకు ప్రజలు సహకరించాలని కోరారు.
-ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని, ‘డ్రంక్ అండ్ డ్రైవ్’కు దూరంగా ఉండాలని అవగాహన కల్పించారు.
-సైబర్ నేరాలపై అవగాహన
పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడించరాదని సూచించారు. అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయవద్దని, సైబర్ మోసానికి గురైన వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.
-బాలల భద్రతకు ప్రాధాన్యం
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, బాలికల విద్య, భద్రతకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చిన్నారులపై లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడితే పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు బాలల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
-డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా
కోడూరు రూరల్ సర్కిల్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలపై డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని వెల్లడించారు.గంజాయి, ఇతర మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
-మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం
మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు తెలిపారు. మహిళలు తమకు ఎదురయ్యే వేధింపులు, ఇతర సమస్యలను భయపడకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.‘పల్లె నిద్ర’ కార్యక్రమం ద్వారా పోలీసులు గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు, సమస్యాత్మక ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా తెలుసుకుంటున్నారు. ముందస్తు నిఘా, భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తూ గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు కోడూరు రూరల్ సర్కిల్ సీఐ తెలిపారు.



