రిపబ్లిక్ సమ్మిట్–2026లో నారా లోకేష్ తో బీదా
న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన రిపబ్లిక్ సమ్మిట్–2026లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి, యువత పాత్ర, అమరావతి నిర్మాణం మరియు విజన్–2047 లక్ష్యాలపై తన స్పష్టమైన ఆలోచనలను దేశ ప్రజల ముందుంచారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ ఇతర ఎంపీలతో కలిసి పాల్గొన్నారు.
సదస్సులో మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మాట్లాడుతూ, “యువత ఆలోచనలకు తగ్గట్టుగా రాజకీయ పార్టీలు నడుచుకోవాలి. వారి ఆకాంక్షలను అర్థం చేసుకునేలా యువతకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించాలి. దేశానికి యువ నాయకత్వం అవసరం. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచీ యువతకు పెద్దపీట వేస్తూ వచ్చింది. అది మాటల్లో కాదు, చేతల్లో నిరూపించాం. మా ఎమ్మెల్యేలలో 50 శాతం మంది తొలిసారి ఎన్నికైనవారే. 25 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు. దేశంలోనే అత్యంత యువ పార్లమెంటరీ పార్టీలలో టీడీపీ ఒకటి” అని పేర్కొన్నారు.
గత పదేళ్ల రాజకీయ జీవితంలో ఎదురైన కష్టాలు, సాధించిన విజయాలు రెండింటినీ సమానంగా స్వీకరించి వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నానని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్మాణానికి విజన్–2047 లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని ముందుకు నడిపిస్తున్నారని, తనకు అప్పగించిన విద్య మరియు ఐటీ శాఖల ద్వారా ఆ లక్ష్య సాధనకు కృషి చేస్తున్నామని లోకేష్ వివరించారు.
అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కి ఇచ్చిన అభివృద్ధి హామీలను 2028 నాటికి పూర్తి స్థాయిలో నెరవేర్చుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
*ఈ సందర్భంగా మస్తాన్ రావు యాదవ్ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు దూరదృష్టి, నాయకత్వం మరియు మంత్రి లోకేష్ యువత ఆధారిత పాలన రాష్ట్రాన్ని వేగవంతమైన అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. యువతకు అవకాశాలు, పెట్టుబడులు, ఉపాధి, సాంకేతిక పురోగతి మరియు మౌలిక సదుపాయాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు.


