కాకినాడ , జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 2:*
జగ్గంపేట మండలం ఇర్రిపాక ఏలేరు నది తీరాన కొలువుదీరిన శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్ల శివకేశవుల క్షేత్ర అభివృద్ధి కమిటీ తొలి సమావేశం ఘనంగా జరిగింది.అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల మణమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి జగ్గంపేట శాసనసభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా నూతన కమిటీ సభ్యుల పరిచయ కార్యక్రమం నిర్వహించి, అనంతరం స్వామివార్ల దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా చైర్మన్ జ్యోతుల మణమ్మ మాట్లాడుతూ శివకేశవుల క్షేత్రానికి చైర్మన్ గా నియమించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, కమిటీ సభ్యులందరి సహకారంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు.అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇర్రిపాక శివకేశవుల క్షేత్రాన్ని దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో 45 మంది సభ్యులతో అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కమిటీ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.అందులో భాగంగా ఈ నెల 4వ తేదీన ఎమ్మెల్యే నెహ్రూ , చైర్మన్ జ్యోతుల మణమ్మ ఆధ్వర్యంలో అష్టలక్ష్మీ సమేత లక్ష్మీ నారాయణుడు ఆలయ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని, 5వ తేదీన విశ్వహిందూ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు చేతుల మీదుగా అయోధ్య రామమందిరాన్ని పోలిన నూతన రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని ప్రకటించారు. అదేవిధంగా కోటి రాతి శివలింగాలతో కోటిలింగేశ్వర క్షేత్రాన్ని ఇక్కడే ప్రతిష్టించేందుకు మహత్తర ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ఇది కార్యరూపం దాల్చితే ఈ కమిటీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ సమగ్ర అభివృద్ధి, ఏలేరు నది తీర సుందరీకరణ, ధూప దీప నైవేద్యాలకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


