పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో గోపూజ, గోసేవ
తిరుపతి, సెప్టెంబర్ పున్నమి ప్రతినిధి
ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో సురభి గో సంరక్షణశాలలో సెప్టెంబర్ 4న శ్రీకృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు, ప్రార్థనలు మరియు హారతులు నిర్వహించారు. అనంతరం పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ గోశాలలోని గోవులకు అరటిపండ్లు స్వయంగా తినిపించి గోసేవ నిర్వహించారు. గోమాతకు సేవ చేయడం శ్రీకృష్ణుని ఆరాధనలో ఒక భాగమని, గోసేవ ద్వారా సనాతన ధర్మంలోని కరుణ, సేవాభావం వంటి విలువలను సమాజంలో పెంపొందించవచ్చని ఆయన తెలిపారు.
శ్రీకృష్ణుడు గోపాలుడిగా గోవులను సంరక్షించిన దైవ స్వరూపం అని, గోమాత సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ పేర్కొన్నారు. గోసేవను మరింత విస్తృతంగా చేపట్టి, గోవుల సంరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా భక్తులు శ్రీకృష్ణ నామస్మరణ, భజనలు మరియు ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.





