*భార్యపై భర్త కత్తితో దాడి*
*ఏన్కూరు పోలీస్ స్టేషన్ లో ఘటన*
*తీవ్రంగా గాయపడిన మహిళ*
*ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి*
*తరలింపు
కేసు నమోదు చేసిన పోలీసులు
జులై 20 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు.
భార్యపై భర్త కత్తితో దాడి చేసిన మండల కేంద్రమైన ఏన్కూరు పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఎస్ఐ సంధ్య తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఎర్రబోడు తండాకు చెందిన భూక్య రాంబాబు, తన భార్య రజినిపై కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు ఈ ఘటనకు దారితీసినట్లు సమాచారం. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రజిని తన పుట్టింటైన సాతానిగూడెం గ్రామంలో ఉంటోంది. ఇదిలా ఉండగా, గ్రామ సంఘం ద్వారా తీసుకున్న రుణం చెల్లించాలని సంఘ సభ్యులు ఒత్తిడి చేయడంతో రజినిని ఏన్కూరులోని ఎస్బీఐ బ్యాంకుకు తీసుకువచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న భర్త రాంబాబు బ్యాంకు వద్దకు వచ్చి రజినితో వాగ్వాదానికి దిగాడు. దీంతో బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ 100కు డయల్ చేయగా పోలీస్ సిబ్బంది ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. రజిని పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకెళ్లారని సమాచారం తెలుసుకొని రాంబాబు పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. రజిని ఎడమ భుజం, ఎడమ చేతి మణికట్టు భాగంలో కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఏన్కూరు పోలీసులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఎస్సై సంధ్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల పూర్తి కారణాలు, కుటుంబ వివాదాలపై విచారణ చేపట్టినట్లు ఆమె తెలిపారు. పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనతో ఏన్కూరు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.



