*ప్రజావాణికి సమయపాలన కరువు..*
*ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల వైఫల్యం*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
మండలంలో ప్రజావాణి నిర్వహణపై మండల ప్రజల ఆవేదన
ఏన్కూరు:
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఏన్కూరు మండలంలో కొందరు అధికారులు సమయపాలన పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చిన సమయంలో వచ్చి, తమకు అనుకూలమైన సమయంలో వెళ్లిపోతున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు సమయపాలన పాటించకపోతే సామాన్య ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.
ప్రజావాణికి హాజరయ్యే అధికారుల వివరాలను నమోదు చేసేందుకు ప్రత్యేక హాజరు రిజిస్టర్ను సక్రమంగా నిర్వహించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.
కొందరు అధికారులు ప్రజావాణి కార్యక్రమానికి వచ్చినప్పటికీ ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు అడిగిన ప్రశ్నలకు, అధికారులు ఇచ్చే సమాధానాలకు పొంతన లేకుండా నిర్లక్ష్యంగా స్పందిస్తున్నారని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్ని శాఖలకు చెందిన అధికారులు ఆలస్యంగా హాజరవుతున్న విషయంపై ఏన్కూరు మండల ఎంపీడీవో ను వివరణ కోరగా, వారు తమ కార్యాలయాలకు వెళ్లి తిరిగి వస్తున్నారని సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. అయితే ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాల్సిన అధికారులు సమయానికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.
మండల స్థాయి అధికారులు తమ శాఖల సిబ్బందిపై బాధ్యతాయుతమైన పర్యవేక్షణ చేపట్టకుండా, ఆలస్యంగా వచ్చిన అధికారులకు సమర్థనలు చెప్పడం వల్ల ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమం కేవలం మొక్కుబడి కార్యక్రమంగా కాకుండా, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా ఉండాలని వారు కోరుతున్నారు. అధికారులు సమయపాలన పాటించేలా, హాజరు రిజిస్టర్ను తప్పనిసరిగా నిర్వహించేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


