పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తుర్కయాంజల్ మున్సిపాలిటీ మాజీ అధ్యక్షులు, అడ్వకేట్ పట్నం రమేష్ కురుమ ఆధ్వర్యంలో చింతపల్లిగూడ గ్రామానికి చెందిన బాధితుడు జోగు స్వామి తండ్రి రాములు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆదిభట్ల సర్కిల్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
చింతపల్లిగూడ గ్రామంలో జోగు స్వామి ఇంటి ముందు గణేష్ మండపం నిర్మాణానికి అవసరమైన స్థలం ఉన్నప్పటికీ, రాకపోకలకు అడ్డంకిగా ఉండే విధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా గణేష్ మండప నిర్మాణం చేపడుతున్నారని బీఎస్పీ నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా, ఈ విషయంలో హైకోర్టు స్టేటస్కో ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని సైతం లెక్కచేయకుండా నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి, బాధితుడికి న్యాయం చేయాలని కమిషనర్ను కోరారు.
వినతిపత్రంపై సత్వరమే స్పందించిన కమిషనర్ సత్యనారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంచార్జి బంగారుగల్ల మహేందర్, మున్సిపాలిటీ మాజీ ఉపాధ్యక్షులు లపంగి రాజు, కార్యదర్శి నెమలి సత్యనారాయణ, సీనియర్ నాయకులు బూతం రమణ, అడ్వకేట్ పల్లాటి మహేష్ తదితరులు పాల్గొన్నారు.


