దశమహావిద్య సాధన ఎంతో గొప్పదని బ్రహ్మంగారి మఠం ఆచలానంద ఆశ్రమ అధిపతి విరజానందస్వామి అన్నారు. కడప నగరం చలమారెడ్డిపల్లిలోని భువనేశ్వరి మాత దేవాలయ పునర్నిర్మాణం, శిఖర కలశ ఏర్పాటు కార్యక్రమంలో ఆయన పాల్గొని గురువు గొప్పతనం, ధార్మిక అంశాలపై వివరించారు.
ఈ సందర్భంగా ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ గురు పరంపర గురించి వివరించారు. సాధనా సంపత్తితో ఎలాంటి శక్తినైనా సాధించవచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ దేవాలయంలో ప్రశాంతత నెలకొని ఉందని అన్నారు.
మృత్యుంజయేశ్వర సర్వమంగళదేవి పీఠం అధ్యక్షులు రామకృష్ణ నేటి సమాజంలో భక్తితత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం తదితర అంశాలపై వివరించారు. భువనేశ్వరి దేవాలయ నిర్వాహకులు నాగేంద్ర మహోదర దశమహావిద్యా విధానం గురించి వివరించారు.
అనంతరం భువనేశ్వరి మాతకు విరజానందస్వామి, డాక్టర్ పసుపులేటి శంకర్ల చేతుల మీదుగా అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు ఆలయ నిర్వాహకులు సంప్రదాయ పద్ధతిలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ వేమూరి వెంకటరామిరెడ్డి, హిందూ ధర్మం టెంపుల్స్ ప్రేయర్ సొసైటీ వ్యవస్థాపకులు, జాతీయ ఉపాధ్యక్షులు సోము కళానాథరెడ్డి, భారతీయ హిందూ ఐక్య వేదిక అధ్యక్షులు కల్లూరి విజయానందరెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీనాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, న్యాయవాది భారవి, దేవాలయ వ్యవస్థ ప్రతినిధి లక్ష్మీకళ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమం ముగింపులో అతిథులను దేవాలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.



