*అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు*
*యువ ఓటర్లను చేర్పించడంపై దృష్టి పెట్టండి*
*ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ*
విజయనగరం, జిల్లా బ్యూరో/ రమణ, ఆగస్టు 28. (పున్నమి ప్రతినిధి )
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పకడ్బందీగా, నిబంధనలకు అనుగుణంగా, పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నామని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటును తొలగించకుండా, అదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా అత్యంత ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ శుక్రవారం కలెక్టరేట్లో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో సర్ ప్రక్రియ పురోగతిని వివరించారు. మ్యాపింగ్ కాని, ఎనామలీస్కు సంబంధించి సుమారు లక్షా, 93,734 మందికి నోటీసులను అందజేసినట్లు తెలిపారు. వారినుంచి వివరణ తీసుకున్న తరువాతే, వారి ఓటుపై తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఈ నెల 29,30 తేదీల్లో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నామని, ఆ రెండు రోజులూ బిఎల్ఓలంతా పోలింగ్ కేంద్రాల్లో ఉంటారని చెప్పారు. ఖాళీ 6,7,8 ఫారాలన్నీ అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
ఈ సందర్భంగా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి మాట్లాడుతూ..ప్రతీఏటా ఓటర్ల జాబితా సవరణ ప్రకియ జరుగుతోందని, ఈ సారి 2004 జాబితాతో మ్యాపింగ్ చేసి ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ముసాయిదా జాబితాను ప్రచురించడం జరిగిందని, పలు మార్పులు చేర్పులు అనంతరం అక్టోబరు 3న తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. నోటీసు ఇవ్వకుండా, అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు తొలగించడం జరగదని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన కొత్త ఓటర్లను గుర్తించి జాబితాలో చేర్చడంతో పాటు, యువ ఓటర్లపై దృష్టి పెట్టాలని కోరారు. దీనికోసం జిల్లాలో విస్తృతంగా స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించి, పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో సుమారు 82వేల మంది యువ ఓటర్లను జాబితాలో చేర్పించాల్సి ఉందన్నారు. అలాగే పివిటిజిలపై ప్రత్యేక దృష్టిపెట్టి, వారికి ఓటుహక్కును కల్పించాలని కోరారు. జిల్లాలో ఈపి రేషియో (జనాభాలో ఓటర్ల శాతం) 630 పై సంతృప్తిని వ్యక్తం చేస్తూనే, దానిని ఇంకా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ పార్టీలు తమ సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఏమైనా తనకు నేరుగా తెలియజేయవచ్చునని సూచించారు.
జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ మాట్లాడుతూ, జిల్లాలో ఇపి రేషియోను పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే సర్కు సంబంధించి వివిధ యాప్లపై విస్తృతంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. యువ ఓటర్ల కోసం స్వీప్ కార్యక్రమాన్నినిర్వహిస్తామని, స్పెషల్ డ్రైవ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులను తమ అభిప్రాయాలను తెలియజేశారు.
సమావేశంలో ఇన్చార్జి డీఆర్ఓ ఎం. అరుణకుమారి, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.




