పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
ఎలమంచిలి: రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో ఎలమంచిలికి చెందిన క్రీడాకారులు సత్తా చాటి తొమ్మిది పతకాలు సాధించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీకాకుళంలోని వైఎస్సార్ కళ్యాణ మండపంలో జరిగిన రాష్ట్రస్థాయి టైక్వాండో పోటీల్లో అనకాపల్లి జిల్లా తరఫున సత్య స్పోర్ట్స్ అకాడమీకి చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ పోటీల్లో జూనియర్ బాలికల అండర్-46 కేజీల విభాగంలో ఎం. హర్షిత బంగారు పతకం సాధించగా, పి. సింహాద్రి రజత పతకం సాధించారు. సబ్ జూనియర్ బాలికల అండర్-35 కేజీల విభాగంలో ఎం. రిత్విక, క్యాడెట్ బాలికల ఓవర్-59 కేజీల విభాగంలో రిజ్వానా బేగం, అండర్-68 కేజీల విభాగంలో పి. గాయత్రి వర్షిణి, జూనియర్ బాలుర అండర్-55 కేజీల విభాగంలో ఆర్. విష్ణువర్ధన్, సీనియర్ విభాగంలో పి. రవితేజ, వి. జగన్, టి. సాయికుమార్ కాంస్య పతకాలు సాధించారు.
క్రీడాకారుల ప్రతిభపై సత్య స్పోర్ట్స్ అకాడమీ ఫౌండర్ నగిరెడ్డి సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. విజేతలను టైక్వాండో సంఘం అధ్యక్షుడు జగదీష్ పాల్, ఉపాధ్యక్షుడు రాయవరపు సుధాకర్, టీమ్ మేనేజర్లు పి.వి. రమణ, ఎం. గోపి తదితరులు అభినందించారు. భవిష్యత్ పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

