80 నిమిషాల నాన్స్టాప్ స్కేటింగ్ మారథాన్ ఘన విజయం
మన్నెగూడలో కేహలో భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం
యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామానికి చెందిన పొలమోనీ శ్రీకాంత్ (S/o కృష్ణయ్య) ఆధ్వర్యంలో కేహలో భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నిర్వహించిన 80 నిమిషాల నాన్స్టాప్ స్కేటింగ్ మారథాన్ మన్నెగూడలోని ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ వేదికగా ఘనంగా జరిగింది.
ఈ ప్రతిష్ఠాత్మక స్కేటింగ్ మారథాన్లో చిన్నారులు, యువ స్కేటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. 80 నిమిషాల పాటు నిరంతరాయంగా స్కేటింగ్ చేస్తూ తమ ప్రతిభను, పట్టుదలను చాటుకున్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన ఆర్గనైజర్ పొలమోనీ శ్రీకాంత్ను ఢిల్లీ వరల్డ్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఘనంగా సన్మానించి అభినందించింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
స్కేటింగ్ వంటి క్రీడలను చిన్ననాటి నుంచే ప్రోత్సహిస్తే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, పట్టుదల పెరుగుతాయని పేర్కొన్నారు. 80 నిమిషాల పాటు నాన్స్టాప్గా స్కేటింగ్ చేసిన క్రీడాకారుల ప్రతిభను అభినందించారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన క్రీడాకారులు, తల్లిదండ్రులు, కోచ్లు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, క్రీడాభిమానులు, సహకరించిన ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




