*సీతారామ కాలువలో నాణ్యత డొల్ల!*
పది రోజులు నీళ్లు పారకముందే ధ్వంసమైన సైడ్ లైనింగ్ సీసీ పనులు*
*రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణంపై రైతుల అనుమానాలు..*
*నాణ్యతపై ఉన్నతస్థాయి విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వాలి*
*రాకపోకలకు దారిలేక అవస్థలు.. మెట్లు, ర్యాంపులు లేక పశువులకూ ప్రమాదమేనంటున్న రైతులు*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఆగస్టు 13
ఏన్కూరు:
సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రాజీవ్ లింక్ కెనాల్ పనుల నాణ్యతపై ఏన్కూరు మండల రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపట్టిన కాలువ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కాలువలో నీటిని విడుదల చేసి పట్టుమని పది రోజులు గడవకముందే పలు ప్రాంతాల్లో సైడ్ సీసీ లైనింగ్ ధ్వంసం కావడం చర్చనీయాంశంగా మారింది.
కాలువకు ఇరువైపులా నిర్మించిన కాంక్రీట్ సైడ్ లైనింగ్ పలుచోట్ల విరిగి కిందకు జారిపడటంతో వాటి వెనుక ఉన్న మట్టి కట్ట బయటపడుతోంది. కొన్ని ప్రాంతాల్లో కాంక్రీట్ పలకలు పూర్తిగా పగిలిపోయి కాలువలో పడిపోగా.. మరికొన్ని చోట్ల లైనింగ్ కింద మట్టి కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది.
నీటి ప్రవాహాన్ని తట్టుకోలేక ఇంత త్వరగా నిర్మాణం దెబ్బతినడంపై రైతులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పది రోజుల్లోనే పగుళ్లు.. నాణ్యతపై
కాలువ నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీట్ మిశ్రమం, సిమెంట్, ఇసుక, కంకర నాణ్యతతో పాటు సైడ్ లైనింగ్ మందం, బేస్ తయారీ, క్యూరింగ్ తదితర అంశాలను నిపుణులతో పరిశీలించాలని రైతులు కోరుతున్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా పనులు చేపట్టడం వల్లే సైడ్ సీసీ పనులు ఇంత త్వరగా దెబ్బతిన్నాయా లేక నీటి ప్రవాహం, మట్టి పరిస్థితులు, డిజైన్లో ఏమైనా లోపాలున్నాయా అనే విషయాలను సాంకేతిక నిపుణుల బృందంతో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతులకు కాలువ.. రాకపోకలకు ఇబ్బందులు
సాగునీటిని అందించాల్సిన కాలువ నిర్మాణం రైతులకు మరోవైపు రాకపోకల సమస్యగా మారిందని స్థానికులు చెబుతున్నారు. పొలాలకు వెళ్లేందుకు కాలినడకన సరైన మార్గాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు పొలాల వద్దకు తీసుకెళ్లడం కష్టంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలువలోకి దిగేందుకు, మరోవైపు వెళ్లేందుకు అవసరమైన చోట్ల సరైన మెట్లు, ర్యాంపులు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా పశువులు కాలువలోకి జారిపడితే వాటిని సురక్షితంగా బయటకు తీసుకురావడం కూడా కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*చుక్కనీరు రాకపోతే ప్రయోజనం ఏమిటి*
రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా ఏన్కూర్ మండల రైతులకు సాగునీటి ప్రయోజనం కల్పించాల్సి ఉండగా.. తమ పొలాలకు ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాలువ ద్వారా తమ భూములకు సాగునీరు అందకపోతే ప్రాజెక్టు లక్ష్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
“కాలువ నిర్మాణం పూర్తయినా రైతుల పొలాలకు నీరు చేరకపోతే నిర్మాణం వల్ల ప్రయోజనం ఎవరికి అని రైతులు నిలదీస్తున్నారు. ప్రాజెక్టు ద్వారా వాస్తవంగా ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతోంది? ఏన్కూర్ మండలానికి నిర్దేశించిన నీటి ప్రయోజనం ఎంత అనే వివరాలను అధికారులు ప్రజలకు వెల్లడించాలని కోరుతున్నారు.
*భూగర్భ జలాలపై రైతుల్లో ఆందోళన*
కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేయడం వల్ల కాలువ నీరు భూమిలోకి ఇంకే అవకాశం తగ్గుతుందని, దీనివల్ల స్థానిక భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందేమోనని కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భవిష్యత్తులో బోర్ల నీటిమట్టాలపై ప్రభావం పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
అయితే కాలువ లైనింగ్ వల్ల భూగర్భ జలాలపై ప్రభావం ఎంతమేర ఉంటుందనే అంశాన్ని సాంకేతికంగా, శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ప్రజల అభిప్రాయం.
స్థానిక భూగర్భ జలాల పరిస్థితి, మట్టి స్వభావం, కాలువలో నీటి ప్రవాహం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అధికారులు వాస్తవ పరిస్థితిని వెల్లడించాలని రైతులు కోరుతున్నారు.
*థర్డ్పార్టీతో నాణ్యత పరీక్షలు చేయాలి*
సైడ్ సీసీ పనులు దెబ్బతిన్న ప్రాంతాలను కేవలం మరమ్మతులు చేసి వదిలేయకుండా..
మొత్తం రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణ పనుల నాణ్యతను సమగ్రంగా పరిశీలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్ నాణ్యత, కాంక్రీట్ బలం, లైనింగ్ మందం, బేస్ ప్రిపరేషన్, క్యూరింగ్, డిజైన్, డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాలను స్వతంత్ర సాంకేతిక నిపుణులతో పరీక్షించాలని కోరుతున్నారు.
అవసరమైతే థర్డ్పార్టీ నాణ్యతా పరీక్షలు నిర్వహించి నివేదికను బహిరంగపరచాలని డిమాండ్ చేస్తున్నారు.
అలాగే పనులకు సంబంధించిన అంచనాలు, డిజైన్, కొలతల పుస్తకాలు (ఎం.బుక్), బిల్లులు, నాణ్యతా పరీక్షల నివేదికలు, మెటీరియల్ టెస్టింగ్ రిపోర్టులను పరిశీలించాలని రైతులు కోరుతున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
నిర్మాణ పనుల్లో లోపాలు ఉన్నట్లు అధికారుల సాంకేతిక తనిఖీలో తేలితే సంబంధిత కాంట్రాక్టర్పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పనులను పర్యవేక్షించిన అధికారులు, ఇంజినీరింగ్ సిబ్బంది పాత్ర పైనా సమగ్రంగా విచారణ జరపాలని కోరుతున్నారు.
ప్రజాధనంతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో నాణ్యత విషయంలో రాజీపడితే భవిష్యత్తులో మరమ్మతులకు మళ్లీ ప్రజాధనం ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు పెరిగేలోపు చర్యలు తీసుకోవాలి
ప్రస్తుతం కాలువలో పలు ప్రాంతాల్లో సైడ్ లైనింగ్ దెబ్బతిన్న నేపథ్యంలో వర్షాలు, నీటి ప్రవాహం మరింత పెరిగితే కాలువ గట్లు కూడా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు హెచ్చరిస్తున్నారు
. గట్లు కోతకు గురైతే సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి నీరు చేరి పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.
అందువల్ల అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించాలని, తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు.
రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం వెనుక ఉన్న అసలు లక్ష్యం రైతుల పొలాలకు సాగునీరు అందించడం.
నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర సాంకేతిక విచారణ చేపట్టాలి. పనుల్లో లోపాలు ఉన్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుని, దెబ్బతిన్న సైడ్ సీసీ పనులను నాణ్యతతో పునర్నిర్మించాలని ఏన్కూర్ మండల రైతులు, ప్రజలు కోరుతున్నారు.
Uploaded Video:


