రూ.68 లక్షలతో నిర్మాణం.. గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం సి.కందులవారిపల్లి గ్రామంలో స్వర్ణ గ్రామ కార్యాలయం, గ్రామీణ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బాలు రామాంజులు నాయుడు ఆధ్వర్యంలో సుమారు రూ.68 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ కార్యాలయం, ఆరోగ్య కేంద్రాన్ని ముఖ్య అతిథులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ కస్తూరి విశ్వనాథ నాయుడు, కుడా చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన్ శ్రీ కె.కె. చౌదరి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మాచినేని విశ్వేశ్వర నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కస్తూరి విశ్వనాథ నాయుడు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో సి.కందులవారిపల్లిలోనే గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు వైద్యం కోసం ఇతర గ్రామాలు, పట్టణాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తొలగనున్నాయని తెలిపారు.
అదేవిధంగా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు అందించడంతో పాటు, ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు స్వర్ణ గ్రామ కార్యాలయం కీలకంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామంలోనే ప్రభుత్వ సేవలు అందుబాటులోకి రావడం ప్రజలకు ఎంతో ప్రయోజనకరమన్నారు.
సి.కందులవారిపల్లికి స్వర్ణ గ్రామ కార్యాలయం, గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేసిన ఎన్డీఏ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్వర్ణ గ్రామ సిబ్బంది, గ్రామీణ ఆరోగ్య కేంద్రం సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


