ఓబులదేవరచెరువు:
శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండల కేంద్రంలోని వైఎస్సార్ సర్కిల్లో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జి దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ హయాంలో పేదలు, రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం అమలు చేసిన పలు పథకాలను నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, హంద్రీ-నీవా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాల ద్వారా ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేశారని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయని వైఎస్సార్సీపీ శ్రేణులు పేర్కొన్నారు. మహానేత ఆశయాలను కొనసాగించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.
భావోద్వేగానికి గురిచేసిన పాట
కార్యక్రమం అనంతరం మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డిని స్మరించుకుంటూ మామిళ్లకుంట్లపల్లికి చెందిన హనుమంతరెడ్డి ఆలపించిన పాట అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది. వైఎస్సార్ ప్రజల కోసం చేసిన సేవలను గుర్తుచేస్తూ ఆయన ఆలపించిన పాటతో పలువురు నాయకులు, కార్యకర్తలు కన్నీటి పర్యంతమయ్యారు. మహానేతతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.
రోగులకు బ్రెడ్, పండ్ల పంపిణీ
వైఎస్సార్కు నివాళులర్పించిన అనంతరం స్థానిక ఆసుపత్రిని సందర్శించి చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. ఈ సందర్భంగా రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. మహానేత వైఎస్సార్ చూపిన సేవా స్ఫూర్తితో ప్రజలకు అండగా నిలవాలని, పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తమ వంతు సహాయం అందించాలని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.




