సంచార జాతులు, పూసల సంఘం నాయకుల హర్షం
మంథని, సెప్టెంబర్ 01:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీని “విముక్త జాతుల దినోత్సవం”గా అధికారికంగా ప్రకటించి, ప్రతి సంవత్సరం జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయడంపై సంచార జాతులు, పూసల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, సహచర మంత్రులు, ప్రభుత్వ అధికారులకు తెలంగాణ రాష్ట్రంలోని సంచార, అర్ధసంచార జాతుల తరఫున, పూసల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పూసల సంఘం మాజీ కార్యనిర్వహణ అధ్యక్షుడు గుంటుపల్లి సమ్మయ్య, మంథని నియోజకవర్గ పూసల సంఘం, బీసీ ఫెడరేషన్ కులాల సమితి కన్వీనర్ కావేటి సమ్మయ్య మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిబాపూలే జయంతి, సర్వాయి పాపన్న జయంతి వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తరహాలోనే, అత్యంత వెనుకబడిన సంచార, అర్ధసంచార జాతుల చరిత్రను గుర్తిస్తూ ఆగస్టు 31న విముక్త జాతుల దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం చారిత్రక నిర్ణయమని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విముక్త జాతుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన సంచార, అర్ధసంచార జాతుల చరిత్ర, సమస్యలు, అభివృద్ధి అవసరాలను సమాజం దృష్టికి తీసుకురావడానికి ఈ దినోత్సవం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విముక్త జాతుల అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని సంక్షేమ చర్యలు చేపట్టాలని వారు కోరారు. ముఖ్యంగా బీసీ కులాల కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, పాలక మండళ్లను ఏర్పాటు చేసి, ఆయా కులాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విముక్త జాతుల దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించడం ద్వారా రాష్ట్రంలోని సంచార, అర్ధసంచార వర్గాలకు మరింత గుర్తింపు లభించిందని, భవిష్యత్లో వారి సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం మరిన్ని నిర్ణయాలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


