( పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
భోగాపురం ఎయిర్పోర్టు పేరుతో ప్రజలపై అదనపు భారాలు మోపడం తక్షణమే ఆపాలని వైఎస్సార్సీపీ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆశీలమెట్టలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎయిర్పోర్టు కోసం భూములు కోల్పోయిన స్థానిక మత్స్యకారులకు ఉద్యోగాల్లో తగిన ప్రాధాన్యం కల్పించకపోవడం అన్యాయమన్నారు. జీఎంఆర్తో ప్రభుత్వం లాలూచీ పడిందని ఆరోపించారు. పార్కింగ్, ప్రయాణికుల చార్జీలు, ఇతర రుసుముల పేరుతో అధిక వసూళ్లు చేస్తున్నారని విమర్శించారు. టాక్సీలకు రెండు గంటల పార్కింగ్కు రూ.600 వరకు వసూలు చేయడం దారుణమన్నారు. విశాఖ ప్రజలకు అన్యాయం జరుగుతున్నా స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వస్తే ఎయిర్పోర్టు కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి రూ.10 లక్షల పరిహారం అందిస్తామని తెలిపారు. విశాఖ ఎయిర్పోర్టును కొనసాగించాలని, జిల్లాకు మరో ఎయిర్పోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.


