మేడిపల్లి ZPHS విద్యార్థులకు ఘన సన్మానం
SSCలో యాచారం మండల 2వ స్థానం సాధించిన గోదాసు సుష్మాకు రూ.10,116 నగదు బహుమతి
యాచారం: నక్కర్త మేడిపల్లి గ్రామంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ZPHS మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో SSC ఫలితాల్లో యాచారం మండలంలో రెండో స్థానం సాధించిన గోదాసు సుష్మాతో పాటు 550కుపైగా మార్కులు సాధించిన 8 మంది విద్యార్థులను PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త నగదు బహుమతులు, మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.
SSCలో మండల రెండో స్థానం సాధించిన సుష్మాకు పాఠశాల HM ఉదయశ్రీ రూ.10,116 నగదు బహుమతిని అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ముచ్చర్ల సుగుణ, ఉప సర్పంచ్ మధుకర్ రెడ్డి, PACS డైరెక్టర్ మక్కపల్లి స్వరూప మాట్లాడుతూ విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు, ఆశయాలు, దేశభక్తిని స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఎంచుకుని దానిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. చెట్లు నాటడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలని, తల్లిదండ్రులు పిల్లలతో సమయం గడుపుతూ కుటుంబ విలువలను పెంపొందించాలని అన్నారు. రైతులు, సైనికులు, శాస్త్రవేత్తలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు.
PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. “ఏదో ఒక రోజు ఇదే మేడిపల్లి ZPHS పాఠశాలకు మీరు ముఖ్య అతిథులుగా రావాలి. నేడు మీరు చేసే సంతకాలు భవిష్యత్తులో ఆటోగ్రాఫ్లుగా మారే స్థాయికి ఎదగాలి” అంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. దేశం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ బోడ కృష్ణ, CPM మండల కార్యదర్శి ఆలంపల్లి నర్సింహ, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.





