బ్లాక్ కాఫీలో బొద్దింక.. కస్టమర్కు చేదు అనుభవం
మన్నెగూడలోని చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ సెంటర్లో ఘటన — పరిశుభ్రతపై వినియోగదారుల ఆగ్రహం
ఇబ్రహీంపట్నం: జీహెచ్ఎంసీ ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని మన్నెగూడలో ఉన్న చెన్నపట్నం ఫిల్టర్ కాఫీ సెంటర్లో ఓ కస్టమర్కు చేదు అనుభవం ఎదురైంది. బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసిన ఓ వినియోగదారుడికి కాఫీలో బొద్దింక కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురైనట్లు తెలిపారు.
కస్టమర్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్లాక్ కాఫీ నల్లగా ఉండటంతో కాఫీ తాగే వరకు అందులో ఏదైనా ఉన్న విషయం గుర్తించలేదని, కాఫీ పూర్తిగా తాగిన అనంతరం కప్పు అడుగున బొద్దింక కనిపించడంతో ఆందోళనకు గురైనట్లు చెప్పారు.
ఈ విషయంపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా, తాము కాఫీ సెంటర్ను పరిశుభ్రంగానే నిర్వహిస్తున్నామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు కస్టమర్ ఆరోపించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. “మెనూలో ధరలు పెంచడంపై ఉన్న శ్రద్ధ హోటల్ను పరిశుభ్రంగా ఉంచడంపై ఎందుకు లేదు? బొద్దింక స్థానంలో బల్లి పడి ఉంటే పరిస్థితి ఏమిటి?” అంటూ ప్రశ్నించారు.
ఆహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. హోటళ్లు, కాఫీ సెంటర్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలను అధికారులు క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.
ఫుడ్ సేఫ్టీ, శానిటేషన్ అధికారులు స్పందించి సంబంధిత కాఫీ సెంటర్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.





