బీసీ భవన్లో తాత్కాలిక బీసీ బాలికల వసతి గృహం ఏర్పాటు చేయాలి: బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ డిమాండ్
కడప: బీసీ భవన్లో తాత్కాలికంగా బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలని, ఓల్డ్ రిమ్స్ ప్రాంతంలోని బీసీ భవన్ పక్కన అక్రమంగా నిర్మించిన భవనాన్ని తొలగించాలని బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు తిప్పిరెడ్డిపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
స్థానిక బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు తిప్పిరెడ్డిపల్లి నాగేశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఓబులగారి కేశవులు మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా కోపరేటివ్ కాలనీలోని ఓ ప్రైవేట్ భవనంలో బీసీ బాలికల వసతి గృహం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అయితే ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందని, పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయని, బాత్రూంలలో విద్యుత్ షాక్ ప్రమాదం ఉందని, రేకుల షెడ్డులో అధిక వేడి ఉండటంతో పాటు వర్షాకాలంలో గదులు కారిపోతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థినులు చదువును కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా వ్యాప్తంగా, అలాగే రాయలసీమలోని వివిధ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో విద్యార్థినులు కడప నగరానికి వచ్చి విద్యను అభ్యసిస్తున్నారని, సరైన వసతి సౌకర్యాలు లేకపోవడంతో కొంతమంది మధ్యలోనే చదువులు మానేసే పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు.
కాబట్టి జిల్లా ఇన్చార్జ్ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ వెంటనే స్పందించి విద్యార్థినుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. విద్యార్థుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ భవనంలో వసతి గృహాన్ని ఏర్పాటు చేసి విద్యార్థినులను తరలించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ జిల్లా కార్యదర్శి శివశంకర్, బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాల వీరప్ప, బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ జిల్లా నాయకులు బాల సుందరం తదితరులు పాల్గొన్నారు.

