ఖమ్మం, ఆగస్టు 12:
రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి Custom Milled Rice (CMR)గా భారత ఆహార సంస్థ (FCI)కి సకాలంలో సరఫరా చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించాలని బీజేపీ కిసాన్ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షులు నరుకుల్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
CMR సరఫరాలో జాప్యం వల్ల రైతులతో పాటు ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాల్లో సరఫరా చేసిన CMR, మిల్లింగ్లో ఉన్నది, పెండింగ్లో ఉన్నది వంటి పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. పెండింగ్ CMRను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, మిల్లింగ్, రవాణా, నిల్వలోని ఆటంకాలను తొలగించాలని అన్నారు. జిల్లాల వారీగా CMR పురోగతి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, జాప్యం కారణంగా ప్రభుత్వంపై పడుతున్న అదనపు ఆర్థిక భారంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు సీనియర్ నాయకులు మందడపు సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.
అన్నారుగూడెం క్లస్టర్కు శాశ్వత AEOను నియమించాలి
అన్నారుగూడెం క్లస్టర్లో శాశ్వత వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) లేక రైతులు విత్తనాలు, ఎరువులు, పంటల సాగు, ప్రభుత్వ పథకాలు, సాంకేతిక సూచనల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని వెంకటేశ్వరరావు తెలిపారు. వెంటనే పూర్తి స్థాయి AEOను నియమించి రైతులకు వ్యవసాయ శాఖ సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతుల సమస్యల పరిష్కారమే కిసాన్ మోర్చా ప్రధాన లక్ష్యమని, రైతులకు న్యాయం జరిగే వరకు నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నాగమణి, ప్రధాన కార్యదర్శి ఆపతి వెంకట రామారావు, ఉపాధ్యక్షులు బెల్లం మురళి, బుర్రా శ్రీను, కార్యదర్శి కొమ్మినేని కృష్ణారావు, పెరిక కిరణ్, కొండ వెంకన్న, కోటి హనుమంతరావు, రవి, బొల్లారం బాబు, మీగడ గోపి తదితరులు పాల్గొన్నారు.



