ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీ ప్రారంభం
*తడ, ఆగస్టు 26
తిరుపతి జిల్లా తడ మండలం పూడికుప్పం గ్రామంలో ‘సెయింట్ గోబైన్’ సంస్థ జాయింట్ నిధులు రూ.34 లక్షలతో నిర్మించిన నూతన మోడల్ అంగన్వాడీ భవనాన్ని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ బుధవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ … చిన్నారులకు మెరుగైన వాతావరణంలో పూర్వ ప్రాథమిక విద్య, పోషకాహారం మరియు సంరక్షణ సేవలు అందించేందుకు ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. సీఎస్ఆర్ భాగస్వామ్యంలో భాగంగా గ్రామంలో రాత్రివేళ వెలుతురు సౌకర్యం కోసం పూడికుప్పానికి 9 సోలార్ ఎల్ఈడీ లైట్లను కూడా సంస్థ అందించిందని తెలిపారు.
నియోజకవర్గంలో విద్య, ఆరోగ్యం, తాగునీరు, పారిశుధ్యం మరియు గ్రామీణ మౌలిక వసతుల కల్పనకు సీఎస్ఆర్ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమానికి పరిశ్రమల సహకారం తోడైతే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.
చిన్నారుల కోసం మోడల్ భవనాన్ని నిర్మించి, లైట్లను అందించిన సెయింట్ గోబైన్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెయింట్ గోబైన్ సంస్థ ప్రతినిధులు, ఐసీడీఎస్ అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


