40 ఏళ్లుగా పరిష్కారం కాని డ్రైనేజీ సమస్య.. కొత్త పత్తూరు ప్రజల ఆవేదన
వైఎస్సార్ కడప జిల్లా ఖాజీపేట మండలం కొత్త పత్తూరు గ్రామంలో గత 40 సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి మురుగునీరు రోడ్లపై నిలిచిపోవడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో పాటు దుర్వాసన, దోమల సమస్య అధికమవుతోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో గ్రామానికి వచ్చిన నాయకులకు గ్రామస్తులు తమ సమస్యను వివరించి, డ్రైనేజీ నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఖాజీపేట మండలం టీడీపీ ఉపాధ్యక్షుడు జిలానీ బాషా మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు ఇప్పటికైనా శాశ్వత పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి డ్రైనేజీ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఇరగం రెడ్డి ప్రతాప్ రెడ్డి, అచ్చుకట్ల జిలాన్, ఫరూక్, అహమ్మద్, కమలాపురం గౌస్, అసిఫ్, నూరుల్లా, జెండాల మహబూబ్ బాషా, ఎం.ఎస్. సలీమ్, అబ్దుల్, పూల సుల్తాన్ అహమ్మద్, నంద్యాల సుబ్బయ్య యాదవ్, జైలు సుబ్బరాయుడు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

