ఆత్మకూరు , ఆగస్టు 17 (పున్నమి ప్రతినిధి): వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం. రాములు హెచ్చరించారు.
సంగం వద్ద నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై ఎంవీఐ రాములు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్ఫోన్ వినియోగించడం చేయరాదన్నారు. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, ట్రాక్టర్లపై ప్రమాదకరంగా ప్రయాణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వాహనదారులు నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని ఎంవీఐ రాములు తెలిపారు. రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.


