నాన్ జీఎంఓ మొక్కజొన్న వంగడాల సృష్టి – వ్యవసాయ రంగ విప్లవంలో కీలక మైలురాయి
• కొత్త వంగడాన్ని ఆవిష్కరించిన గోర్మె పాప్ కార్నికా సంస్థకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభినందనలు
మొక్కజొన్న సాగులో రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడులు అందించే వంగడాలను అభివృద్ధి చేసిన ఏలూరు జిల్లా, ముసునూరు గోర్మె పాప్ కార్నికా సంస్థకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. వ్యవసాయ రంగ విప్లవంలో ఈ వంగడం కీలక మైలురాయిగా పేర్కొన్నారు. గోర్మె పాప్ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన జన్యుపరంగా మార్పులు చెందని (Non-GMO) పాప్ కార్న్ మొక్కజొన్న వంగడాన్ని గౌరవ భారత ఉప రాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారు, గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం రాష్ట్ర వ్యవసాయ రంగానికి గర్వకారణమన్నారు. ఈ పరిశోధనలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. జన్యుపరంగా మార్పులు చెందని వంగడాల అభివృద్ధి రైతులతోపాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వినూత్న ఆవిష్కరణను విజయవంతంగా రూపొందించిన గోర్మె పాప్ కార్నికా సంస్థ యాజమాన్యానికి, శాస్త్రవేత్తలకు, పరిశోధక బృందానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు. రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.


