*దివ్యాంగులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది… రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి*
*దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది*
*ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి*
*దివ్యాంగులకు ఉచితంగా త్రీ వీలర్ (ట్రై మోటార్) సైకిళ్ళ పంపిణీ చేసిన మంత్రి*
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం:
కూసుమంచి
దివ్యాంగుల సంక్షేమానికి, వారి ఆర్థిక, సామాజిక వికాసానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన దివ్యాంగులకు ప్రభుత్వం తరఫున వంద శాతం సబ్సిడీపై సమకూర్చిన త్రీ వీలర్ (ట్రై మోటార్) సైకిళ్ళను బుధవారం కూసుమంచి క్యాంపు కార్యాలయం వద్ద పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా, తమ స్వశక్తితో జీవించేందుకు అవసరమైన సహాయ ఉపకరణాలను ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. రవాణా సౌకర్యం సులభతరం కావడానికి ఈ ట్రై మోటార్ సైకిళ్లు ఎంతో తోడ్పడతాయని అన్నారు. దివ్యాంగత్వాన్ని వైకల్యంగా భావించకుండా, బలమైన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. సరైన పట్టుదల ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని, దివ్యాంగులు సమాజంలో స్వయం సమృద్ధి సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు.
రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి దివ్యాంగునికి ప్రభుత్వ పథకాలు, పింఛన్లు, ఇతర సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, దివ్యాంగ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.


