జయశంకర్ భూపాలపల్లి,20 ఆగష్టు (పున్నమి ప్రతినిధి):చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం ఐడీఓసీ కార్యాలయపు కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ, ఇరిగేషన్, మెగా కంపెనీ అధికారులతో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూ సేకరణ, కాలువల నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికతో వేగవంతం చేయాలని సూచించారు. భూ సేకరణకు సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, ప్రాజెక్టు నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భూ సేకరణకు అవసరమైన భూముల సర్వే ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, సర్వేకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు అందచేయాలని ఆదేశించారు.
కాలువల నిర్మాణ పనులతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, పనుల అమలులో ఎదురవుతున్న సమస్యలను శాఖల మధ్య సమన్వయంతో పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా రెవెన్యూ, ఇరిగేషన్, సంబంధిత సంస్థల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. పనుల పురోగతిపై నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం ఆర్డీఓ రవీందర్, తహసీల్దార్లు, ఇరిగేషన్ ఇంజినీర్లు, మెగా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


