ఖమ్మం: కాంగ్రెస్ అంటేనే దగా, మోసం అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఖమ్మం నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే కాంగ్రెస్పై ప్రజలను హెచ్చరించారని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేశామని, ప్రస్తుతం రైతుబంధు అరకొరగా అమలు చేస్తూ, రుణమాఫీని సక్రమంగా చేయడం లేదని ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా అందడం లేదని, గురుకుల విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నారని తెలిపారు. ఆరు గ్యారంటీలు, 420 హామీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు.
సీతారామ ప్రాజెక్టుపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, జర్నలిస్టులకు గతంలో మంజూరైన 23 ఎకరాల భూమిని ఇప్పటికీ కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, భూ దోపిడీలు పెరిగాయని ఆరోపించారు.
కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేస్తూ, “కేసీఆర్ రావడం పక్కా.. రామరాజ్యం కావడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు” అని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
కార్యక్రమం లో నగర మాజీ అధ్యక్షులు పగడాల నాగరాజు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, మాజీ సూడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ లు ఉన్నారు



