అనకాపల్లి జిల్లా, (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
యలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామం చివర కొండ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో సుమారు 170 ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు తాము ఏటికొప్పాక గ్రామానికి చెందినవారమేనని, తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవాలని కోరుతున్నారు.
కాలనీలో మంచినీటి ట్యాపులు ఉన్నప్పటికీ తాగునీరు సక్రమంగా రావడం లేదని, దీంతో మంచినీటి కోసం సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే కాలనీలో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేక వర్షాకాలంలో, రాత్రివేళల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా కాలనీ నుంచి ప్రధాన రహదారి వరకు పొలాల మధ్యగా వెళ్లే మార్గంలో వీధి దీపాలు లేక రాత్రివేళల్లో భయాందోళనగా ఉంటోందని పేర్కొన్నారు.
ఉపాధి, ఉద్యోగాల కోసం కంపెనీలకు వెళ్లే కాలనీ వాసులు ప్రధాన రహదారి వద్ద బస్సులు, ఆటోల కోసం వేచి ఉండాల్సి వస్తోందని తెలిపారు. అక్కడ బస్సు షెల్టర్ లేకపోవడంతో ఎండైనా, వర్షమైనా నిలబడేందుకు కనీస వసతి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“మేమూ ఏటికొప్పాక గ్రామానికి చెందినవారమే.. మా సమస్యలను కూడా పట్టించుకోండి” అంటూ కాలనీ వాసులు అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. కాలనీకి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ప్రధాన రహదారి వద్ద బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Uploaded Video:

