పున్నమి: రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలో కుంట్లూరు, పల్లవి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు విద్యార్థుల భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రధారణలో పాల్గొన్న విద్యార్థులు నృత్యాలు, భక్తిగీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా కళాశాల నిర్వహణ ప్రతినిధి బెరెల్లి కమలాకర్ రావు మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించిన విద్యార్థులను అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఐక్యత, నాయకత్వ లక్షణాలు, సాంస్కృతిక విలువలను పెంపొందిస్తాయని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.బి.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విద్యార్థులు భగవద్గీతలోని విలువలను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణ, నైతికత, ఆత్మవిశ్వాసంతో ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. ప్రశాంత్ కుమార్ భగవద్గీతలోని కర్తవ్యనిష్ఠ, మనోనిగ్రహం, సమత్వ భావన, నిస్వార్థ సేవ వంటి విలువలను విద్యార్థులకు వివరించారు.
అనంతరం నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


