ఖమ్మం
లక్ష్యం ఎంత పెద్దదైనా పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నిస్తే విజయం సాధించవచ్చని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పొంగులేటి స్వరాజ్యం–రాఘవరెడ్డి (పీఎస్ఆర్) చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, రైట్ ఛాయిస్ నిర్వహణలో ఖమ్మం బైపాస్ రోడ్డులోని రామకృష్ణ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉచిత కోచింగ్ క్యాంప్ను గురువారం మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2016లో 2,300 మందికి శిక్షణ అందించగా, 350 మందికి పైగా ఉద్యోగాలకు ఎంపికయ్యారని గుర్తుచేశారు. వారి తల్లిదండ్రుల ఆనంద భాష్పాలు మరువలేనివని అన్నారు. మధ్యతరగతి, నిరుద్యోగ యువత భవిష్యత్తుకు అండగా ఉంటానని, ఉత్తమ ఫ్యాకల్టీ, రీజనింగ్ పుస్తకాలతో ఏర్పాటు చేసిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పిస్తామని ప్రకటించారు. రైట్ ఛాయిస్ నిర్వాహకులు మెండెం కిరణ్ కుమార్ కృషిని ప్రశంసించారు.
కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఏదులాపురం మున్సిపల్ చైర్పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మార్కెట్ కమిటీ చైర్మన్ వి. సీతారాములు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొర్రా రాజశేఖర్, అడిషనల్ డీసీపీ రామానుజం, ఐఏఎస్ ట్రైనర్ ఆకెళ్ల రాఘవేంద్రరావు, రీజనింగ్ ఫ్యాకల్టీ రమణ తదితరులు పాల్గొన్నారు.



