తెలంగాణ ఉద్యమకారులు, కళాకారుల పాదయాత్రకు ఏన్కూరులో ఘన స్వాగతం
సాలువాలతో సత్కరించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు
పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు,
మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కళాకారులు భద్రాచలం వరకు చేపట్టిన పాదయాత్రకు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు పాదయాత్రికులను సాలువాలతో సన్మానించి అభినందించారు.
మండల ప్రధాన రహదారిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పాదయాత్ర కొనసాగుతున్న ఉద్యమకారులు, కళాకారులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా కమిటీ సభ్యుడు గిద్దగిరి సత్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం కాలయాపన చేయకుండా నిజమైన తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులను గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో పొందుపరిచిన హామీల మేరకు ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ తదితర సంక్షేమ సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో పాదయాత్రికులు కాంపల్లి వంశీ, మేడ జోజి, పగిడిపోలు వెంకట్రావు, కొత్తగూడెం రాజా, రమేష్, అనుదీప్, ఆవుల గోపయ్య గౌడ్ పాల్గొన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు గిద్దగిరి సత్యనారాయణ, నల్లమోతుల రమేష్, మంకెన కృష్ణ, ఇంజం దేవదాస్, కొంటూ సాంబయ్య, తాళ్లూరు వెంకటప్పయ్య, దేశిని గణేష్, జర్రిపోతుల సుందరం తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఘనంగా జరిగింది.


