భూ భారతి రెండో అప్పీళ్లు నెలల తరబడి పెండింగ్ – అధికారుల తీరుపై బాధితుల ఆవేదన
జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో ఫిర్యాదులు పరిష్కారం కాకపోతే ప్రజావాణి ఉద్దేశమేంటని ప్రశ్న
పున్నమి ప్రతినిధి
ఆసిఫాబాద్ | ఆగస్టు 6, 2026
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు స్వీకరించినప్పటికీ వాటి పరిష్కారంలో నెలల తరబడి జాప్యం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం శ్రీనివాస్ తన భూ సమస్యకు సంబంధించి భూ భారతి రెండో అప్పీల్ కింద జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో రెండుసార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మొదటి ఫిర్యాదును 16-03-2026న సమర్పించగా దాదాపు ఐదు నెలలు, రెండో ఫిర్యాదును 04-05-2026న సమర్పించగా మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం వెలువడలేదని వాపోయారు.
మొదటి దరఖాస్తుకు సంబంధించిన ఫైలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని అసైన్మెంట్ భూముల విభాగంలో పెండింగ్లో ఉందని, ఆ విభాగంలోని సూపరింటెండెంట్ను పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రతిసారి ఏదో ఒక కారణం చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
రెండో దరఖాస్తుకు సంబంధించిన ఫైలు రెబ్బెన తహసీల్దార్ (ఎంఆర్వో) కార్యాలయంలో పెండింగ్లో ఉందని, ఫైల్ను ముందుకు పంపకుండా జాప్యం చేస్తున్నారని దుర్గం శ్రీనివాస్ ఆరోపించారు. ఈ విషయంపై తహసీల్దార్ కార్యాలయంలో కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని తెలిపారు.
“స్పందన లేకపోతే ప్రజావాణి ఎందుకు?”:
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులపై అధికారులు స్పందించకపోతే ఈ కార్యక్రమం నిర్వహించడం వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనం ఏమిటని దుర్గం శ్రీనివాస్ ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు.
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి?:
తన దరఖాస్తులే కాకుండా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రజావాణిలో సమర్పించిన అనేక దరఖాస్తులు కూడా నెలల తరబడి పెండింగ్లోనే ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొన్ని దరఖాస్తులను ఉద్దేశపూర్వకంగానే ఆన్లైన్లో నమోదు చేయడం లేదని, దీంతో వాటి పురోగతిని తెలుసుకునే అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నారు.
గడువు తేదీ ప్రకటించాలని డిమాండ్:
ప్రజావాణిలో దరఖాస్తు స్వీకరించే సమయంలోనే సమస్య పరిష్కారానికి సంబంధించి రిపోర్టు ఎప్పుడు అందజేస్తారో అధికారికంగా గడువు తేదీ ప్రకటించాలని, ప్రతి దరఖాస్తు పురోగతిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అధికారుల వైఖరి మారకపోతే ప్రజావాణి వృథానే:
అధికారుల పని తీరులో మార్పు రాకపోతే జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం కేవలం ఫిర్యాదులు స్వీకరించే ప్రక్రియగానే మిగిలిపోతుందని, ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా మారదని బాధితులు అభిప్రాయపడుతున్నారు.



