పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
అనకాపల్లి: ఆటో, మోటార్ కార్మికులపై అధిక జరిమానాలకు కారణమవుతున్న జీవో నంబర్ 21, 31ను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ అనకాపల్లి జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో, మానవహారం చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్త్రీ శక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం గణనీయంగా తగ్గిందని, పెట్రోల్, డీజిల్ ధరలు, పన్నులు, ఇన్సూరెన్స్ భారాలతో జీవనం కష్టంగా మారిందన్నారు. డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలని కోరారు. 60 ఏళ్లు దాటిన డ్రైవర్లకు నెలకు రూ.10 వేల పెన్షన్, ప్రమాద బీమా, ఉచిత వైద్యం, విద్య అందించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, సంఘం నాయకులు పెద్దిరెడ్ల నాగేశ్వరరావు, కోరుబిల్లి జగదీష్, మహంతి శాంతి, షేక్ అన్సర్ బేగ్, చంద్రరావు, బాలు, వై.రాజు, అప్పన్నదొర, పి.వెంకటేష్, లోవరాజు, కన్నా అప్పారావు, సీపీఐ నాయకులు వియ్యపు రాజు, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


