జాతీయ స్థాయి OFCM–2026కు ఇద్దరు విద్యార్థుల ఎంపిక
విశాఖపట్నం జిల్లా, భీమిలి (పున్నమి ప్రతినిధి), ఆగస్టు 21: స్థానిక శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి (SVLNS) ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు గణితంలో తమ ప్రతిభను జాతీయ స్థాయిలో చాటారు. కళాశాలకు చెందిన బైనపల్లి రోజ, గొంపా సాయి కుమార్ MTTS నిర్వహించే ప్రతిష్టాత్మక OFCM–2026 (Online Foundation Course in Mathematics) శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కేవలం 12 మంది విద్యార్థులకు అవకాశం లభించగా, అందులో ఇద్దరు భీమిలి ప్రభుత్వ కళాశాల విద్యార్థులు ఉండటం విశేషం. గణితంలో తార్కిక ఆలోచన, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే ఈ శిక్షణ విద్యార్థుల ఉన్నత విద్య, పరిశోధన, పోటీ పరీక్షల ప్రస్థానానికి ఎంతో దోహదపడనుంది. ఈ ఘనతపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేఖ, గణిత విభాగాధిపతి డాక్టర్ కె.వి. విద్యాసాగర్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. భీమిలి ప్రభుత్వ కళాశాల కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన విద్యార్థుల ప్రతిభకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.



