ఖమ్మం జులై
(పున్నమి న్యూస్)
ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం రూరల్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వాహనాల తనిఖీల్లో మోటార్సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, వారు ఖమ్మం రూరల్, ఖమ్మం III టౌన్, ఖానాపురం హవేలి, కూసుమంచి, అలాగే సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పలు బైక్ చోరీ కేసులకు పాల్పడినట్లు అంగీకరించారు.
పోలీసుల విచారణలో ప్రధాన నిందితుడు చిలకబత్తిని వెంకటేష్ తనతో పాటు నలుగురు బాల నేరస్తులతో (CCL) కలిసి రాత్రి వేళల్లో డూప్లికేట్ తాళాల సహాయంతో మోటార్సైకిళ్లను చోరీ చేసి, వాటిని వివిధ వ్యక్తులకు విక్రయించినట్లు వెల్లడైంది. ఈ కేసులో మండవ సాయి, కొక్కు రోనక్, రామాల మహేందర్, ప్రసాదం రాజు (రిసీవర్)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురు బాల నేరస్తులను జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు. కాగా ప్రధాన నిందితుడు చిలకబత్తిని వెంకటేష్ పరారీలో ఉండగా, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
నిందితుల స్వచ్ఛంద ఒప్పుకోలు, వారి చూపుడు మేరకు మొత్తం 9 మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 9 మోటార్సైకిల్ చోరీ కేసులను విజయవంతంగా ఛేదించినట్లు తెలిపారు.

