తాళ్లపూడి పున్నమి ప్రతినిధి, జూలై 29:
పాఠశాల విద్యార్థినులకు యుక్తవయస్సులో కలిగే శారీరక మార్పులు, ఆరోగ్య సమస్యలపై సమగ్ర అవగాహన అవసరమని శ్రీ పరస పద్మ రాజారావు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయిని సి.హెచ్. సుబ్బలక్ష్మి అన్నారు. స్థానిక శ్రీ సాయిస్పూర్తి హాస్పిటల్స్లో గైనకాలజిస్ట్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ కె. మౌనిక 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినులతో ముఖాముఖి చర్చించి వారి సందేహాలను నివృత్తి చేస్తూ, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సూచనలు అందించారు. కార్యక్రమంలో ఆసుపత్రి మేనేజింగ్ పార్ట్నర్ గూడా విజయరాజు, లింగంపల్లి సుధీర్ కుమార్, ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.


