కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించి రైతాంగాన్ని మోసం చేస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ హామీలను ప్రజలకు మరోసారి గుర్తు చేసేందుకు ప్రతి నియోజకవర్గంలో రైతు సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రఘునాథపాలెం మండలం బోయచెలక/రేవులచెలక గ్రామంలో రైతు సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ రైతులు, అన్ని వర్గాల ప్రజల కోసం ప్రత్యేక డిక్లరేషన్లు ప్రకటించి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే తదితర అగ్రనేతల సమక్షంలో అనేక హామీలు ఇచ్చిందన్నారు. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచిందని విమర్శించారు.
ముఖ్యంగా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన వెంటనే రుణమాఫీ చేస్తామని ప్రచారం చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం అరకొర రుణమాఫీతో రైతులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే రైతుల సమస్యలపై మరింత గట్టిగా ప్రశ్నిస్తామని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రజల ముందు ఎండగడతామని పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.



