– రూరల్ ఎస్ఐ ఉపేంద్ర
యలమంచిలి : వినాయక చవితి ఉత్సవాల వేళ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలంతా సహకరించాలని రూరల్ ఎస్ఐ ఉపేంద్ర కోరారు. బుధవారం యలమంచిలి మండలంలోని పి.ఎన్.ఆర్ పేట గ్రామాన్ని సందర్శించిన ఆయన, పండుగ నిర్వహణపై గ్రామస్తులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ ఉపేంద్ర మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సమయంలో ఎటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని, గొడవలకు తావివ్వకుండా వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని హెచ్చరించారు. గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని, మండపాల వద్ద నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


