22-A బాధిత రైతుల సమస్య పరిష్కారానికి ప్రశాంత్ రెడ్డి కృషి
హరీష్రావును కలిసిన మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, బాధిత రైతులు
రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రెండు రోజుల్లో ప్రభుత్వంపై పోరాటం : హరీష్రావు
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 27:
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు గ్రామాల రైతులు సెక్షన్ 22-A కారణంగా ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి) ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. రాందాస్పల్లి, శేరిగూడ, కోహెడ, పటేల్గూడ తదితర గ్రామాలకు చెందిన బాధిత రైతులతో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్రావును కలిసి సమస్యలను వివరించారు.
22-A జాబితాలో భూములు ఉండటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, రైతుబంధు, రైతుబీమా వంటి ప్రభుత్వ పథకాలు అందకపోవడం, బ్యాంకు రుణాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని బాధిత రైతులు హరీష్రావు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా హరీష్రావు స్పందిస్తూ.. ప్రైవేట్, రైతుల భూములను 22-A పరిధిలోకి తీసుకురావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. అర్హత ఉన్న భూములపై 22-A ఆంక్షలను తక్షణమే తొలగించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు న్యాయం చేయకపోతే రెండు రోజుల్లో ప్రభుత్వంపై పోరాటానికి కార్యాచరణ ప్రకటిస్తామని, అవసరమైతే ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి వచ్చి రైతుల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హరీష్రావు హెచ్చరించారు. రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రశాంత్రెడ్డి చేసిన కృషిని బాధిత రైతులు అభినందించారు.




