ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
హెలీప్యాడ్, రహదారి, ఎమ్మెల్యే నివాసాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
విజయనగరం జిల్లా బ్యూరో, రమణ | ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి
ఎస్.కోట శాసనసభ్యులు కోళ్ల లలిత కుమారి రాంప్రసాద్ దంపతుల కుమార్తె వివాహం త్వరలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం (ఆగస్టు 22) ఎల్.కోట మండలానికి రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ఎల్.కోట గ్రామానికి చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి హెలిపాడ్ నుండి నేరుగా శాసనసభ్యుల నివాసానికి చేరుకుని కాబోయే వధూవరులను ఆశీర్వదిస్తారు.
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ శుక్రవారం మధ్యాహ్నం ఎల్.కోట మండలం ఎల్.కోట గ్రామంలో పరిశీలించారు. ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు ఏర్పాటు చేయనున్న హెలీప్యాడ్ ప్రాంతాన్ని, హెలీప్యాడ్ నుంచి శాసనసభ్యుల నివాసం వరకు ఉన్న రహదారిని, అలాగే శాసనసభ్యుల నివాసాన్ని వారు పరిశీలించారు.
హెలీప్యాడ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, రహదారి మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, బారికేడింగ్ తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్, ఎస్పీ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సజావుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని, అవసరమైన చోట్ల పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులకు సూచించారు. హెలీప్యాడ్ నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు మార్గంలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లను సంబంధిత అధికారులు సమన్వయంతో పూర్తి చేస్తున్నారు.


