పున్నమి ప్రతినిధి :ఆనంద్
యలమంచిలి : మండలంలోని జెడ్పీహెచ్ఎస్ జంపాపాలెం పాఠశాలలో ఓజోన్ డే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఓజోన్ పొర ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ. విజయకుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వై.ఎన్. రాజు, ఆది ఎన్. రాజు, సంపత్, సుజాత, కెర్లిన్, నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓజోన్ పొర భూమిపై జీవరాశిని సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి రక్షిస్తుందని తెలిపారు. ఓజోన్ పొర పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణహిత చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై నినాదాలు చేస్తూ, ఓజోన్ పొర సంరక్షణపై అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు.


