కొవ్వూరు ఆగస్టు19 పున్నమి న్యూస్ ప్రతినిధి
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ సమావేశాల్లో కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు ప్రజల రవాణా సమస్యలను ప్రస్తావించారు. కొవ్వూరు మీదుగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, బరంపురం తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు తప్పనిసరిగా కొవ్వూరు బస్స్టాండ్లో హాల్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం అనేక బస్సులు కొవ్వూరు బస్స్టాండ్లోకి రాకుండా బైపాస్ మీదుగా వెళ్లిపోవడంతో స్థానికులు, పరిసర గ్రామాల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రాజమహేంద్రవరం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు కూడా బైపాస్ను కాకుండా కొవ్వూరు బస్స్టాండ్కు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని, దింపి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా పెరిగిన రద్దుతో పాటు, 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
కొవ్వూరు ప్రజల రవాణా సౌకర్యాలే లక్ష్యంగా.. ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా బలంగా వినిపిస్తున్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు.


