కొత్తవలస లో గల వాగ్దేవి కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ పార్టీ
ముఖ్య అతిథిదులు గా పాల్గొన్న –గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ అధినేత రాపర్తి జగదీష్ బాబు, వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రమౌళి.
విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ, సెప్టెంబర్ 3. ( పున్నమి ప్రతినిధి )
కొత్తవలస మండలం తుమ్మకాపల్లి లో గల వాగ్దేవి కళాశాలలో ఫ్రెషర్స్ పార్టీ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నూతన విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలుకుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థుల నృత్యాలు, పాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, వినోదభరితమైన ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమానికి వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ కెంబూరు చంద్ర మౌళి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కళాశాల జీవితాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.
గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు గౌరవ అతిథిగా పాల్గొని విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. విద్యార్థి దశలో ఏర్పడే ఆలోచనలు, అలవాట్లు, లక్ష్యాలే భవిష్యత్తుకు పునాది వేస్తాయని పేర్కొన్నారు. సమాజానికి సేవ చేసే మంచి పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. తర్వాత గురుదేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబు కు వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రమౌళి కు కళాశాల యాజమాన్యం సాలువ కప్పి, పూలమాలిచ్చి, మెమొంటో ఇచ్చి సన్మానం చేశారు
కళాశాల కరస్పాండెంట్ కొటిన మహేశ్వరరావు, డైరెక్టర్ సి.హెచ్. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు కళాశాల యాజమాన్యం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
విద్యార్థుల ఆటపాటలతో సందడిగా కళాశాల ప్రాంగణం
ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా సీనియర్ విద్యార్థులు నూతన విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థుల నృత్యాలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ వినోద కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. నూతన విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని ఆస్వాదించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్స్ సురేష్, రాజ్కుమార్, సతీష్ తో పాటు అధ్యాపకులు పాల్గొని నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల విద్యాభ్యాసం విజయవంతంగా సాగి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
“ఫ్రెషర్స్ పార్టీ కేవలం వేడుక కాదు.. కొత్త స్నేహాలకు, కొత్త ఆలోచనలకు, కొత్త లక్ష్యాలకు నాంది” అనే సందేశంతో నిర్వహించిన ఈ వేడుకలు విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.




