విశాఖపట్నం, సెప్టెంబర్ 5 (పున్నమి ప్రతినిధి):
నగరంలోని బీజేపీ కార్యాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కళకళలాడింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకున్నారు. శ్రావణ శుక్రవారం పవిత్రమైన రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవడం ఆనందదాయకంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన ధర్మం, కర్తవ్యనిష్ఠ, సత్యనిష్ఠ వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆకాంక్షించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీవీఎన్ మాధవ్ స్వయంగా ఉట్టి కొట్టి సందడి చేశారు. దీంతో అక్కడి వాతావరణం కేరింతలు, నినాదాలతో మార్మోగింది. పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృష్ణాష్టమి వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళలు, యువకులు, పార్టీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగర ప్రజలకు బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
Uploaded Video:



