ఎస్ఐఆర్ ఫైనల్ నోటీసుల కోసం అధికారుల కోసం ఎదురుచూసిన వార్డు ప్రజలు
నిర్మల్: సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా జారీ చేసిన ఎస్ఐఆర్ ఫైనల్ నోటీసులు తీసుకునేందుకు నిర్ణయించిన చివరి తేదీ గురువారం (27న) కావడంతో నోటీసులు అందుకున్న బాధిత కుటుంబాలు సంబంధిత కేంద్రాలకు చేరుకున్నారు. అయితే నిర్ణీత సమయానికి అధికారులు, సిబ్బంది హాజరుకాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి, ఆందోళనకు గురయ్యారు.
సంబంధిత అధికారులు, సిబ్బంది వెంటనే నిర్ణీత కేంద్రాలకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాలని బాధిత కుటుంబాలు కోరారు. అధికారుల నిర్లక్ష్యంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు.
అధికారులు సమయానికి రాకపోవడంతో కౌన్సిలర్ జాకీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్ణీత సమయాన్ని పాటించడం లేదని ఆరోపించారు. అనంతరం అధికారులు స్పందించి ఎమ్మార్వో రాజు, మున్సిపల్ కమిషనర్ రవి బాబు తదితరులు కేంద్రానికి చేరుకుని ఫైనల్ నోటీసులు స్వీకరించే ప్రక్రియను చేపట్టారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ జాకీర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఎస్ఐఆర్ నోటీసులు జారీ చేసినప్పటికీ అధికారులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు నోటీసులు అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. ప్రతి వార్డులో అధికారులు స్వయంగా పర్యటించి నోటీసులు అందించి ప్రజలకు అండగా నిలవాలని కోరారు.
ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికారులు చేయాల్సిన పనులను సామాజిక కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఎక్కువగా నిర్వహించాల్సి వచ్చిందని జాకీర్ పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
Uploaded Video:




