వేమిరెడ్డిపై ఆరోపణలు నిరూపించాలి: రూప్ కుమార్
ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేస్తున్న ఆరోపణలను నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. పార్టీని, కార్యకర్తలను పట్టించుకోకుండా రాష్ట్రానికి దూరంగా ఉన్న అనిల్ ఇప్పుడు వ్యక్తిగత విమర్శలతో వార్తల్లో నిలవాలని చూస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే వేమిరెడ్డి సొంత నిధులతో ధార్మిక, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. సైదాపురం క్వార్ట్జ్ మైన్ల విషయంలో వేమిరెడ్డి రూ.8 వేల నుంచి రూ.10 వేలు అడిగారన్న అనిల్ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. ఆ ఆరోపణను ఒక్క మైన్ యజమానితో నిరూపించినా దేనికైనా సిద్ధమని రూప్ కుమార్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రూ.1,000 కోట్లతో ప్రతిపాదించిన క్వార్ట్జ్ ఫ్యాక్టరీ వ్యాపారం నుంచి వేమిరెడ్డి ఏడాది క్రితమే తప్పుకున్నారని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో అనిల్కు ప్రాధాన్యం లేకపోవడంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. వేమిరెడ్డి స్థాయి, సేవలు ప్రజలకు తెలుసని, అనిల్ రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.


