ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి నీట్లో సత్తా!
ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించిన గిరిజన విద్యార్థి
యాచారం, సెప్టెంబర్ 9: మారుమూల తండాకు చెందిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన గిరిజన విద్యార్థి విస్లావత్ శివ ప్రతిభ చాటుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం సాగించిన శివ ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో 700 మార్కులకు 501 మార్కులు సాధించి, ఉస్మానియా ఆస్పత్రి/మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పచెల్కతాండాకు చెందిన విస్లావత్ భాస్కర్, కమిలి దంపతుల కుమారుడు శివ తన ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అభ్యసించాడు. యాచారం మండలం నక్కర్త–మేడిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2022–23 విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సీ పూర్తి చేశాడు.
నీట్లో మంచి ఫలితం సాధించి మెడికల్ సీటు పొందిన అనంతరం బుధవారం తనకు విద్యాబుద్ధులు నేర్పిన మేడిపల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను శివ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా PRG ఫౌండేషన్ అధ్యక్షులు ప్రొద్దుటూరి రవీందర్ గుప్త, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉదయశ్రీతో పాటు ఉపాధ్యాయులు శివను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు కూడా పట్టుదల, కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని శివ నిరూపించాడని అన్నారు. శివను స్ఫూర్తిగా తీసుకుని ఇతర విద్యార్థులు కూడా లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
మారుమూల తండా నుంచి వచ్చి ప్రభుత్వ పాఠశాలలో చదివి వైద్య విద్యలో సీటు సాధించిన శివ విజయంతో మేడిపల్లి పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




